దారుణం.. నిండు ప్రాణం బలి తీసుకున్న అక్రమ ఇసుక రవాణా..!
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
దారుణం గిరిజనుని పైకి దూసుకెళ్లిన ఇసుక ట్రాక్టర్ ఒకరు మృతి మరొకరు ప్రాణాపాయ స్థితిలో -అక్రమ ఇసుక రవాణాపై స్థానికుల ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో అక్రమ ఇసుక రవాణా విషాదాన్ని మిగిల్చింది. అర్ధరాత్రి సమయంలో నిర్లక్ష్యంగా నడిపిన ట్రాక్టర్ నిద్రిస్తుండగా గిరిజనులను తొక్కేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాకు చెందిన కుంజంషన్ను అనే యువకుడు మృతి చెందగా, శ్యామలచెన్ను అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంపెనగుడెం గ్రామ పరిసరాల్లో అక్రమ ఇసుక రవాణా పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం తెలిసిందే. గురువారం అర్ధరాత్రి సమయంలో ఇసుక ట్రాక్టర్లు వెళుతుండగా, ఆజాగ్రత్తగా నడిపిన ట్రాక్టర్ నిద్రిస్తుండగా గిరిజనులపైకి వెళ్లింది. దీంతో కుంజంపన్ను అక్కడికక్కడే మృతి చెందాడు. శ్యామలచెన్ను తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఈ దారుణ ఘటనపై స్థానిక గిరిజనులు, గ్రామస్తులు తీవ్రంగా స్పందించారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని గతంలో అనేక మార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా, చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం.. వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్ల మండలంలోని గోదావరి పరిసర ప్రాంతాల్లో ఇసుక మాఫియా రోజురోజుకి పెరుగుతూనే ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. అధిక లాభాల కోసం స్థానిక గిరిజనులను పట్టించుకోకుండా, ట్రాక్టర్లతో అనుమతిలేకుండా ఇసుక రవాణా జరుగుతుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ రవాణా వల్ల రహదారులపై ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలి.ఈ ఘటనలో మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని, గాయపడిన వ్యక్తికి మెరుగైన చికిత్స అందించాలని గిరిజన సంఘాలు, హక్కుల సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. అక్రమ ఇసుక రవాణాపై ప్రభుత్వం గట్టిగా స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు మరలిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.